నిచ్చల్ నిన్ను భజించి చిన్మయమహా నిర్వాణపీఠంబు పై
రచ్చల్సేయక యార్జవంబు కుజన వ్రాతంబుచేఁ గ్రాంగి భూ
భృచ్చండాలురఁ గొల్చి వారు దనుఁ గోపింమన్ బుధుం డార్తుఁడై
చిచ్చారం జము రెల్లఁ జల్లుకొనునో శ్రీ కాళహస్తీశ్వరా!
భావం - శ్రీ కాళహస్తీశ్వరా! వివేకవంతులైన పండితులు, కవులు నిరంతరము నిన్ను సేవిస్తూ, నీ విమలజ్ఞానమైన మోక్ష పీఠాన్ని అధిష్టించి నీ ఆదరము పొందుతుండాలి. కాని వీరు అలా చేయడంలేదే. తమ పాండిత ప్రతిభా సౌష్ఠవాన్ని చెడుదారిలోకి తీసుకుపోయేట్లుగా, దుర్జనసమూహముల చేత క్రాగిపోగా, నీచులైన రాజులను సేవిస్తున్నారు. ఎప్పుడైనా రాజులు కోపగించుకుంటే, ఎంత తప్పు చేసాను, ఎంత కష్టపడుతున్నాను అని దుఃఖపడతారు. ఇది మంటలను ఆర్పటాంకి అందులో నూనె ప్రోసినట్లు ఉంటుంది. అనగా కష్టాలు తీరకపోగా అవమానము మొదలైన దుఃఖాలు అధికమవుతాయి.
వ్యాఖ్య : ఒకరిని మెప్పించడానికి ఏ పని చేసినా, అది అంతిమంగా దుఃఖాన్నే మిగులుస్తుంది. మనకున్న ప్రతిభను ఈశ్వరుని మెప్పించడం కోసం ఉపయోగిస్తేనే, అది ఆనందాన్ని, సుఖాన్ని ఇస్తుంది. ఎవరినో మెప్పించడం కోసం కవిత్వాలు రాసేవారు కవులు కారు, పాండిత్య ప్రదర్శన కోసం శాస్త్రాలను చదివే వారు పండుతిలూ కారు. ఈశ్వరుని కీర్తించే వారు కవులు, ఆయన చెప్పిన శాస్త్ర జ్ఞానాన్ని, తమ దృష్టితో కాక, ఈశ్వర ప్రసాదిత బుద్ధితో అర్దం చేసుకుని, జనులకు శాస్త్రంలో ఉన్నది చెప్పేవారే నిజమైన పండితులు.
కామెంట్ను పోస్ట్ చేయండి