జిడ్డు కృష్ణమూర్తి
జిడ్డు కృష్ణమూర్తి మే 12, 1895 న ఆంధ్ర ప్రదేశ్ లోని మదనపల్లె లో ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబం లో జన్మించాడు. ఆయన ఓ ప్రముఖ తత్వవేత్త. 1929 నుండి 1986 లో తను మరణించే వరకు ప్రపంచం నలుమూలల ప్రయాణిస్తూ తాత్విక, ఆధ్యాత్మిక విషయాలపై అనేక ప్రసంగాలు చేశాడు. ఆయన స్పృశించిన ముఖ్యాంశాలు - మానసిక విప్లవం, మనోభావ విచారణ, ధ్యానం, మానవ సంబంధాలు, సమాజం లో మౌలిక మార్పు.
ఆరంభ జీవితం
జిడ్డు కృష్ణమూర్తి 1895 లో మదనపల్లి లో జన్మించాడు. తరువాత వారి కుటుంబమంతా మద్రాసు లో నివాసం పెట్టారు . మద్రాసు లోని "అడయారు" దివ్యజ్ఞాన సమాజం కి అంతర్జాతీయ కేంద్రం గా ఉండేది. అనీ బిసెంట్ దానికి అధ్యక్షురాలు. కృష్ణమూర్తి , ఆయన తమ్ముడు నిత్యానంద కలసి అడయారు నది సముద్రం లో కలిసే చోట నిత్యమూ ఆడుకుంటూ ఉండేవాళ్ళు.
జిడ్డు కృష్ణమూర్తి జీవితంలో ముఖ్య ఘట్టాలు
తత్వవేత్త గా
కృష్ణమూర్తిని జగద్గురువుగా భావించిన డాక్టర్ అనిబిసెంట్ "ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఇన్ ది ఈస్ట్" అనే ఒక అంతర్జాతీయ సంఘాన్ని స్థాపించి, కృష్ణమూర్తిని దానికి ప్రధానిని చేసింది. కొంతకాలం వరకూ కృష్ణమూర్తి అందుకు అభ్యంతరం ఏమీ చెప్పలేదు. అంతవరకూ తాను కృష్ణమూర్తినా లేక జగద్గురువునా అనే విషయంలో ఏ నిర్ణయానికీ రాలేకపోయాడు.
సోదరుని మరణం ఆయనలో తెచ్చిన దుఃఖం కొంతకాలానికి ఆయనలో ప్రతిక్రియను తెచ్చింది. దుఃఖం సమసిపోయి ఒక విధమైన ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని తీసుకువచ్చింది ఆయనలోకి. ఆయనలో జీవం ప్రవేశించింది. తాను జగద్గురువు అని అనిబిసెంట్ చేసిన ప్రచారాన్ని కాదనలేదు. ప్రపంచంలో ఎక్కడలేని గౌరవాలు ఆయనకు జరగసాగేయి.
ఆయన నడచేదారిలో గులాబిపూలు పోసేవారుకూడా. హాలెండ్ లో ఒకరు బ్రహ్మాండమైన సౌధాన్నీ, అయిదువేల ఎకరాలు భూమిని సమర్పిస్తామంటే వద్దని నిరాకరించాడు. ఇటువంటి అద్భుతమైన గౌరవాలు జరుగుతున్నప్పటికీ కృష్ణమూర్తి ఆ గౌరవాలకు విలువ ఇవ్వక, తన ఎప్పటి సాదా జీవితాన్నే గడపసాగేడు. చివరకు అధికారపూర్వకంగా జగద్గురు పీఠాన్ని స్వీకరించమనే ఒత్తిడి ఎక్కువైంది.
అది తనకు ఇష్టంలేదు. తనకు బయట జరుగుతున్న దానికి అంతకూ వ్యతిరేకం కాజొచ్చాడు. తన విశ్వాసానికి విరుద్ధంగా ప్రాపంచిక కీర్తి నిమిత్తమో, పెద్దలకు ఆశాభంగం చేయకుండా ఉండే నిమిత్తమో, భౌతిక లాభాల నిమిత్తమో, ఆయన ప్రవర్తించదలచక చివరకు 1929 లో హాలెండ్ లోని ఆమెన్ లో తాను జగద్గురువు ను కాదని ప్రకటించి "ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఇన్ ది ఈస్ట్ " ను రద్దుపరచాడు.
ఈ మహాత్యాగానికి జగత్తంతా విస్తుపోయింది. డాక్టర్ అనిబిసెంట్ లాంటి పెద్దలంతా నిరాశతో బాధపడ్డారు. అభిప్రాయాన్ని మార్చుకోమని ఒత్తిడి తేబడింది. కాని లాభం లేకపోయింది. తాను జిడ్డు కృష్ణమూర్తినే కాని జగద్గురువును కానని చాటసాగేడు. చివరకు లాభం లేకపోయింది. ఎక్కడివారక్కడ అసంతృప్త హృదయాలతో మౌనం దాల్చారు. అప్పటినుంచీ కృష్ణముర్తి స్వతంత్రమానవుడు, స్వేచ్ఛాచింతకుడు, నవమానవతావాది, ఎవరి అభిమానాలనూ ఆశించక, ఎవరి సహాయాలనూ కాంక్షించక, ఎవరి నిందలనూ లెక్కచేయక, జీవన సంగ్రామపు వాస్తవాన్ని గుర్తించి, గొప్ప జీవన శిల్పిగా రూపొందాడు.
బోధనలు
మనిషి తనంతట తానుగా భయం, కట్టుబాట్లు, అధికారం మరియు మూఢవిశ్వాసాల నుండి విముక్తి చెందాలని బోధించాడు.
ఇతరములు
(1895-1986) ప్రపంచప్రసిద్ధి గాంచిన తత్త్వవేత్త. కృష్ణమూర్తిని ఆయన బాల్యంలో చూచిన లెడ్ బీటర్ (దివ్యజ్ఞాన సమాజోద్యమనేత. మేడమ్ బ్లావెట్స్కీతో పని చేసినవారు), ఆ బాలుని చుట్టూ కనిపించిన అసాధారణ కాంతివలయాన్ని గమనించి అతడు మహాపురుషుడవుతాడని ప్రకటించారు. కృష్ణమూర్తినీ, ఆయన సోదరుడినీ చేరదీసిన లెడ్బీటర్ చదువు చెప్పించి వృద్ధిలోకి తీసుకొని రావాలనుకొన్నారు.
కృష్ణమూర్తి స్వతంత్ర భావాలు త్వరలోనే బయటకొచ్చి ఆయన విశిష్టమూర్తిమత్వం లోకానికి వెల్లడైంది. కృష్ణమూర్తి ఎక్కువ కాలం విదేశాలలో గడిపారు. కానీ, ప్రతి సంవత్సరం భారతదేశానికి వస్తుండేవారు. తెలుగువారైనా తెలుగు దాదాపు మరచిపోయారు. ఈ గ్రంథకర్త ‘‘ఆంధ్రప్రభ’’ సచిత్ర వార పత్రిక సంపాదకులుగా ఉన్నప్పుడు, ప్రతి సంవత్సరం కృష్ణమూర్తితో ఒక ఇంటర్వ్యూ ప్రకటించడం ఆనవాయితీగా ఉండేది.
కృష్ణమూర్తిని గురించి సమగ్రంగా అధ్యయనం చేసిన శ్రీ నీలంరాజు లక్ష్మీ ప్రసాద్ ఈ ఇంటర్వ్యూను నిర్వహిస్తుండేవారు. కృష్ణమూర్తి జీవితం చివరి సంవత్సరం వరకు ఈ ఇంటర్వ్యూల ప్రచురణ కొనసాగింది. ఒక సారి ‘‘మీరు తెలుగువారు కదా. తెలుగు ఏమైనా జ్ఞాపకం ఉందా?’’ అని ప్రశ్నిస్తే ఒంట్లు లెక్కించడానికి ప్రయత్నించి, మూడు - నాలుగు అంకెలు పలికి, ఇటాలియన్ భాషలోకి మారిపోయారు.
తాను గురువును గానీ, ప్రవక్తను గానీ కానని ఆయన చాలా సార్లు ఖండితంగా ప్రకటించారు. ఆయన బోధించిన తత్త్వం ఏ నిర్ణీత తాత్త్విక చట్రంలోకీ ఇమడదు. దాని ప్రత్యేకత దానిదే. సమస్త జీవరాసుల పట్ల ఆయన కారుణ్యాన్ని వ్యక్తం చేస్తుండేవారు. తనదంటూ ఏ వస్తువునూ ఆయన ఏర్పరచుకోలేదు, మిగుల్చుకోలేదు.
జిడ్డు కృష్ణమూర్తిని ఆయన బాల్యంలోనే చూసి, ఆయన చుట్టూ ఉన్న కాంతివలయాన్ని గుర్తించిన వ్యక్తిగా ప్రసిద్ధుడు. బ్లావెట్స్కీతో కలసి పని చేశారు. మొదట క్రైస్తవ మతాచార్యుడు. రహస్య పారమార్థిక విద్యలలో ఆసక్తి వల్ల వివిధ దేశాలు తిరిగి భారతదేశం పట్ల ఆకర్షితుడైనాడు. భారతదేశంలోనే చాలా కాలం గడిపాడు. గుప్త ఆధ్యాత్మికసాధనలో కొంత పురోగమనం సాధించాడు. ఆ శక్తితోనే జిడ్డు కృష్ణమూర్తిని చిన్న వయసులోనే గుర్తించగలిగాడు. ఆయన 1847-1934 సంవత్సరాల మధ్య జీవించాడు.
కృష్ణమూర్తి ప్రసంగాల సారాంశం
“ అసలైన విప్లవం జరగవలసినది హృదయపు లోతులలో. మనిషిలో సమూలమైన పరివర్తన కలగపోతే ఈ యుద్ధాలు, ఈ హింసాకాండ, ఈ విధ్వంసము ఇట్లాగే కొనసాగుతూ ఉంటాయి. ”
“ రాజకీయ, ఆర్ధిక విప్లవాలు కానీ, సామాజిక సంస్కరణలు కానీ ఈ పరివర్తనను తేలేవు. నూతన ఆదర్శాలు, మతాత్మకమైన ఆశయాలు అవలంబించినా, కొత్త సిద్ధాంతాలతో, కొత్త పద్ధతులలో మనిషిని నిర్బంధించినా ఇది జరగదు. తనని తాను పూర్తిగా అవగాహన చేసుకుంటూ హృదయంతో స్పందిస్తూ జీవించటంలోనే పరివర్తన సాధ్యమౌతుంది. ”
తెలుగులో వెలువడిన కొన్ని రచనలు
కృష్ణమూర్తి తత్వం-పరిచయ సంపుటం.
శ్రీలంక సంభాషణలు.
గతం నుండి విముక్తి
ఈ విషయమై ఆలోచించండి(1991),
ముందున్న జీవితం
ధ్యానం
విద్య, అందు జీవితమునకుగల ప్రాధాన్యత
మన జీవితాలు-జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు
స్వీయజ్ఞానం
స్వేచ్ఛ (ఆది లోనూ-అంతంలోనూ)
నీవే ప్రపంచం-జె.కృష్ణమూర్తి
గరుడయానం
నిరంతర సత్యాన్వేషణ-జిడ్డు కృష్ణమూర్తి
భారతీయ ఆధ్యాత్మిక తత్వవేత్త.. జిడ్డుకృష్ణమూర్తి
రిప్లయితొలగించండిలోకాజగన్నాథశాస్త్రీ...
రిప్లయితొలగించండి