స్వామీ వివేకానంద జయంతి -
మోడుల్లా, మొండిగోడల్లా ఎన్నాళ్ళని బ్రతుకుతాం; లంగరు లేని నావల్లా ఎక్కడికని సాగిపోతాం. ఇకనైనా మేలుకొందాం...వజ్రకఠోరమైన సంకల్పం కోసం, ఉక్కు నరాలను, ఇనుప కండరాలను బలిపెడదాం. జింకల్లా కల్లోలపడుతూ...నక్కల్లా కుతంత్రాలు పన్నుతూ కాదు మనం జీవించాల్సింది. మృగరాజులా మహా గంభీరంగా మసలుకుందాం. విశ్వాంతరాళాన్నే మధించగలిగే మేధస్సు నిండిన అమృత పుత్రులం మనం. మణుల వేటకై వెళుతూ మిణుగురుల వెలుగుకు ఆకర్షితులం కావడం అవమానకరం. పరమోన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుందాం.
మనకోసం నిరీక్షిస్తున్న ఆర్తులు, అనాథలు, అభాగ్యులు ఎందఱో ఉన్నారు. స్వామీజీ నినదించినట్లు వారందరిలో ఆ సర్వేశ్వరుడిని దర్శించుకుందాం. నా దేశంలో కుక్క కూడా ఆకలితో చావడాన్ని నేను భరించలేననే వారు స్వామి వివేకానంద. మరి నేడు మన కళ్ళముందే తోటి మానవులు ఆకలితో అలమటిస్తున్నారు. వారికి ఏ ఒక్కరి క్షుద్బాధను తీర్చినా మన జీవితం ధన్యమైనట్లే. మనలో ఎన్నో బలహీనతలు ఉండవచ్చు. అంతమాత్రాన బాధపడాల్సిన పనిలేదు. వాటిని అధిగమించే బలం కూడా మనలోనే ఉంది. వేయిసార్లు విఫలమైనా ఏదో ఒకరోజు మనం వాటి నుంచి బయటపడగలం. ఈ ప్రపంచమనే కర్మాగారంలో వినియోగించక తుప్పుపట్టే యంత్రంలా కాకుండా, శ్రమకు సమర్పణమై సార్థకతను సాధించుకుందాం. కండరాలతో కూడిన మన శరీరాలు అంత్యదశలో ఎముకల గూడును మోసుకుపోవడం వల్ల ప్రయోజనం ఏముంది? స్వామీజీ అంటారు ‘రోగం చేతనో, ఆకలి చేతనో చనిపోవడం కాదు, పరుల కోసం పోరాడి కన్నుమూయండి’ అని. ఆ మహనీయుని అడుగుజాడల్లో పయనిద్దాం, పునీతులమవుదాం.

కామెంట్ను పోస్ట్ చేయండి