శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకర
క్షైకారమ్భకు భక్తపాలన కళా సంరభకున్ దానవో
ద్రేక స్తంభకు గేళిలోల విలసద్ద్రుగ్జాలసంభూతనా
నాకంజాత భవాండ కుంభకు మహానందాంగానా డింభకున్ .
ఇది శ్రీమదాంద్ర మహా భాగవతము లోని మొదటిపద్యము. నవనీత చోరుడు,నంద కిశోరుడు భాగవత కధానాయకుడు .ఆ స్వామి లొకరక్షణకై అవతరించెను. భక్తులను పాలించుటలో సర్వ సమర్ధుడు .లోక కంటకులయిన దానవులను రూపుమాపుటలో ఆద్యుడు. అట్టి శ్రీకృష్ణ పరమాత్మను నేను స్మరింతును. ఇది భాగవత రచనా రంభమునకు ముందు పోతన గారు చేసిన ప్రార్ధన. కావ్యరచనకు ఆస్సీస్సులో ,ప్రార్ధనలో, ముందు ఉండడం సంప్రదాయం .అది పెద్దల ఆదేశం . ఈ కావ్యాన్ని వ్రాయమన్నవాడు కృతి అందుకున్నవాడు ఆ పరమాత్మాయే. రామభద్రుడు కృతి కర్త కధానాయకుడు శ్రీకృష్ణుడు . అన్ని అతనే కదా ! ఈ పద్యంలో భాగవతంలో గల సకల కధలను సూచన ప్రాయంగా మనవిచేసాడు పోతన. భక్తుల రక్షన దుష్టుల శిక్షణ , ఆ పరమాత్మ లీలలు (కృష్ణ లీలలు) ఉన్నాయని ముందుగానే చెప్పాడు. ఈ కావ్య రచనకు పోతనకు అత్యంత ప్రితిపాత్రమయిన ప్రాసలను వదలకుండా నిడుగా ప్రయోగిస్తానని ఈపద్యము లోనే ఆరంభకున్, స్తంబకున్ కుంభకున్ అని సమాసం చివరన ప్రయోగించి చూపించాడు .చదువరులకు చెవులకింపుగా సామాన్యలకు గూడా ఎదో అందం ఉందని వినేలా పదవిద్యను ప్రయోగించాడు. కృతి భర్త లక్ష్మీసమేతుడయినా, పోతన కాసులు సొమ్ములు ఆశించలేదు . కైవల్య ప్రాప్తి కావాలన్న సంకల్పం గట్ట్టిగా పట్టుకున్నాడు .తను కావ్యం ఎందుకు రాస్తున్నాడో అందులో ఏముందో, ఏమి ఆసించాడో,అన్ని ఒక్క పద్యంలో ప్రార్ధనలోనే చెప్పిన ఘనత పోతనదే. కాదంటారా ?
కామెంట్ను పోస్ట్ చేయండి